సహజీవనం చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడం సరికాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సహజీవనం పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ పురుషుడు ఓ మహిళ కలిసి సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తూ, పెళ్లి కాదని తెలిసినప్పటికీ లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటే అది అత్యాచారం కింద పరిగణించలేమని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. పెళ్లి కాదని ముందుగానే తెలిసీ శారీరక సంబంధం కలిగి ఆ తర్వాత పురుషుడు తనపై అత్యాచారం చేశారని చెబితే అది చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది న్యాయస్థానం.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్, మరియు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్లు కలిసి ఒకరి ఇంట్లో ఒకరు గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో మహిళ అయిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్స్ తనకు న్యాయం చేయాల్సిందిగా సుప్రీం కోర్టు గడప తొక్కింది. జస్టిస్ డీవైచంద్రచూడ్, ఇందిరా బెనర్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసును విచారణ చేసింది. అనంతరం పై విధంగా తీర్పు వెల్లడించింది. గత ఆరేళ్లుగా కలిసి సహజీవనం చేశారంటే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇక సీఆర్పీఎఫ్ కమాండెంట్ తనకు 1998 నుంచి తెలుసునని మహిళ పేర్కొంది. 2008లో తనను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన కమాండెంట్... తనను లైంగికంగా లోబర్చుకుని తన కోరికలను తీర్చుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 2016 వరకు వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవని ఇద్దరు ఒకరింట్లో ఒకరు నివాసమున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది. అయితే 2014లో పెళ్లి విషయం వచ్చేసరికి కుల ప్రస్తావన తీసుకువచ్చినట్లు ఆమె చెప్పింది. అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఉండేవారని వివరించింది.
ఇక 2016లో మరో మహిళతో తన ప్రియుడికి ఎంగేజ్మెంట్ అయ్యిందన్న విషయం తెలుసుకున్న మహిళ.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పడం తర్వాత మాట తప్పుతాడని తెలిసి కూడా అతనితోనే ఉండటం బాధితురాలి తప్పే అని కోర్టు అభిప్రాయపడింది. అన్నీ తెలిసి కూడా శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.