నా భర్తకు మళ్లీ పెళ్లా?: సత్యప్రియ ఆవేదన, ఎంపీ శశికళ పుష్ప రెండో పెళ్లిపై సందిగ్ధత
చెన్నై: వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం చర్చనీయాంశంగా మారింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె పెళ్లిపై సందిగ్ధత నెలకొంది. అన్నాడీఎంకే వివాదాస్పద ఎంపీ శశికళ పుష్ప రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.
మార్చి 26న వీరి వివాహం ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామస్వామి మొదటి భార్య తెరమీదకు వచ్చారు. మదురై మహాలింగ పట్టికి చెందిన తనకు, రామస్వామితో 2014లో వివాహం జరిగిందని మంగళవారం మీడియాకు వెల్లడించింది. అందుకు తగిన ఆధారాలను, తన బిడ్డతో పాటు ఉన్న చిత్రాన్ని చూపింది. దీని గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పెళ్ళి ఏర్పాట్లలో శశికళ పుష్ప
పూర్తి వివరాల్లోకి వెళితే.. శశికళ పుష్ప వివాహం మార్చి 26వ తేదీన ఢిల్లీలోని ఓ నక్షత్ర హోటల్లో జరుగనుంది. ఇందుకుసంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ చెంప పగుల గొట్టినందుకు గాను ఆమె అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం ఆమె టీటీవీ దినకరన్ వర్గ ఎంపీగా కొనసాగుతున్నారు.
మొదటి భర్తకు విడాకులు
ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రొ. వైస్ ఛాన్సెలర్, ఎంపీల న్యాయ సలహాదారు డాక్టర్ బి. రామస్వామితో ఆమె వివాహం జరుగనుంది. నిజానికి శశికళ పుష్పకు లింగేశ్వర తిలకన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు... ఇద్దరూ అంగీకరించడంతో వీరికి విడాకులు మంజూరు చేసింది.
మీడియా ముందుకు మొదటి భార్య
ఈ క్రమంలో శశికళ పుష్ప రామస్వామిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో మార్చి 26వ తేదీన ఉదయం 9 గంటలకు వివాహం, ఉదయం 11 గంటలకు నక్షత్ర హోటల్లో గ్రాండ్ విందును కూడా ఏర్పాటు చేశారు. కాగా, 47యేళ్ళ రామస్వామికి ఇప్పటికే వివాహం కావడంతో ఈ వివాహంపై సందిగ్ధత నెలకొంది. ఈయన మొదటి భార్యకు దూరమయ్యాడు. ఆ తర్వాత మరో మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈమె పేరు సత్యపియ్ర (34). వీరికి ఏడాదిన్నర వయసున్న బాలిక ఉంది. శశికళ పుష్పతో రామస్వామి పెళ్లి విషయం తెలిసి ఆమె మీడియా ముందుకు వచ్చారు.
మాయమాటలు.. వాపోయిన సత్యప్రియ
‘నా తండ్రి తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్గా ఉన్నారు. నేను ఎంబీఏ పూర్తి చేశా. ఇంటికి పెద్ద కుమార్తెను. ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వివాహం ఆలస్యం కావడంతో పలువురు బ్రోకర్ల వద్ద నా జాతకాలు ఇచ్చి వరుడుని చూడాల్సిందిగా కోరడం జరిగింది. ఆ తర్వాత ఓ పెళ్ళిళ్ళ బ్రోకర్ రామస్వామితో వివాహం జరిపించాడు. ఆ సమయంలో రామస్వామి ఢిల్లీలో న్యాయమూర్తిగా ఉన్నట్టు చెప్పారు. నిజానికి ఆయనకు అప్పటికే వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. అయినప్పటికీ ఆయనను పెళ్ళి చేసుకునేందుకు సమ్మతించాను. ఫలితంగా రామస్వామితో 2014, డిసెంబరు 12వ తేదీన నా వివాహం జరిగింది. వివాహ సమయంలో నా కుటుంబీలకు, బంధువులందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాను. కానీ వివాహానికి వారెవరూ రాలేదు. వివాహం ముగిసి న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. అక్కడకు వెళ్ళాక ఒక్క రోజు కూడా ఆయన కోర్టుకు వెళ్ళలేదు. ఇదే విషయంపై పలుమార్లు నిలదీయగా, ఒకరోజున ఆయన నిజస్వరూపం బయటపడింది. సిమ్లాలోని ఒక వర్శిటీలో వీసీగా ఉన్నట్టు ఒక రోజు, మరోరోజు బీజేపీ ఎంపీ వద్ద పని చేస్తున్నట్టు ఇలా రోజుకో విధంగా కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ వచ్చారు' అని సత్యప్రియ మీడియాతో వాపోయింది.
నా భర్తకు మళ్లీ పెళ్లా?.. సత్యప్రియ ఆవేదన
కాగా, ‘ ఇంతలో నేను గర్భం దాల్చాను. కానీ, అది ఎక్కువ రోజులు నిలబడకుండా అబార్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ గర్భం దాల్చగా, ఒకటిన్నర సంవత్సరానికి ముందు కాన్పు కోసం పుట్టింటికి వచ్చాను. నేను పుట్టింట్లో ఉన్న సమయంలో శశికళ పుష్ప వద్ద పని చేస్తున్నట్టు ఫోనులో చెప్పాడు.
ఈ నేపథ్యంలో గత 2016 డిసెంబరు 23వ తేదీన నేను ఆడబిడ్డకు జన్మనిచ్చాను. ఆ బిడ్డను కూడా చూసేందుకు రాలేదు. అయితే, బిడ్డ పుట్టిన విషయం వాట్సాప్ ద్వారా, ఫోనులోనూ తెలియజేశాను. ఒక రోజున ఉన్నట్టుండి ఆయన ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని కోరగా.. నేను నిరాకరించాను. ఇదే విషయంపై నేను తిరుప్పరకుండ్ర మహిళా పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఈ కేసు విచారణ కోసం ఆయన వచ్చినపుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి అని పోలీసులకు చెప్పాడు. ఆయనకు రక్షణగా ఒక సెక్యూరిటీ గార్డు కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళగా, నేను మాత్రం న్యాయపోరాటం చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. నా బిడ్డ కోసం నాకు భర్త కావాలి. ఆయనతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను' అని ప్రియ తెలిపింది.