వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు.
ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో కలిసి 2008లో బెంగళూరు చేరుకుని డీజేహళ్ళిలో నివాసం ఉంటున్నారు. నాగరాజ్ బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఇంటికి వెళ్లిన భర్త నాగరాజ్ కు జయలక్ష్మి భోజనం పెట్టింది.
వంట రుచిగా లేదని, నీకు వంట చెయ్యడం రాదని, పిల్లలను సక్రమంగా పెంచడం చేతకాదని భార్య జయలక్ష్మి మీద మండిపడిన నాగరాజ్ తరువాత షాప్ కు వెళ్లిపోయాడు. నిత్యం భర్త నాగరాజ్ ఏదో ఒక విషయంలో వేధింపులకు గురి చేస్తున్నాడని జయలక్ష్మి జీవితంపై విరక్తి పెంచుకుంది.
పిల్లలు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో జయలక్ష్మి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలైన జయలక్ష్మిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జయలక్ష్మి మరణించిందని పోలీసులు తెలిపారు.
ప్రతినిత్యం చిన్నచిన్న విషయాలకు నాగరాజ్ మా కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుందని జయలక్ష్మి కుుటుం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.