70 ఏళ్ల వ్యక్తితో సంబంధం, వద్దన్నందుకు ప్రియుడు, అల్లుడితో కొడుకును చంపించింది
నోయిడా: దాదాపు నెల క్రితం గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రి.. కోట్ కెనాల్ బ్రిడ్జి వద్ద 22 ఏళ్ల అన్షుల్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. విచారణలో కన్నతల్లే అతని హత్యకు ప్రణాళిక వేసి, పురిగొల్పిందని గుర్తించారు.
అందుకు ఆమెకు ఉన్న వివాహేతర సంబంధమే కారణం. వివాహేతర సంబంధం వద్దని కొడుకు చెప్పడంతో ఆమె తన బంధువులు, ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేయించింది. జూన్ 18వ తేదీన అన్షుల్ హత్యకు గురయ్యాడు. అతని గొంతు పిసికి చంపేశారు.
తల్లి, ప్రియుడు సహా అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ దేవిది (45) దాద్రీ పరిధిలోని లుహార్లీ గ్రామం. ఓ వ్యక్తితో తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని ఆగ్రహం చెందిన ఆమె ఇద్దరికి డబ్బులు ఇచ్చి కొడుకును హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది. శుక్రవారం నాడు పోలీసులు అమెతో పాటు గ్రేటర్ నోయిడా పరిధిలోని బదల్పూర్కు చెందిన ఆమె ప్రియుడిని, మరికొందరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులకు అనుమానం
సురేష్ దేవి), సతీశ్ కుమార్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారు అన్షుల్(22), దీపాషు(12). వారి కూతురు, అల్లుడు అమిత్ కుమార్లు మరోచోట ఉంటున్నారు. హఠాత్తుగా అన్షుల్ గతనెల 18న విగతజీవిగా కనిపించాడు. విచారణ చేపట్టేందుకు మృతుని తల్లి ఆసక్తి చూపలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పదేపదే ప్రశ్నించడంతో ఆమె అసలు విషయం చెప్పవలసి వచ్చింది.
తల్లి అతనితో సన్నిహితంగా ఉండటం చూసి
తాను బాబాను అంటూ నాలుగేళ్ల క్రితం కన్నయ్య(70) సురేశ్ దేవికి పరిచయమయ్యాడు. మంత్రాల పేరుతో తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరోజు అన్షుల్ ఇంటికి వచ్చేసరికి కన్నయ్యతో తన తల్లి సన్నిహితంగా ఉంది. దీనిని చూసిన అన్షుల్ వారించాడు.
అల్లుడితో కలిసి ప్లాన్
కన్నయ్య కొసం కొడుకును వదిలించుకునేందుకు ఆమె సిద్ధపడింది. విషయాన్ని అల్లుడు అమిత్కు చెప్పింది. బావమరిది హత్యకు ప్లాన్ వేశాడు. సచిన్(25), సత్యేంద్ర(28), అమిత్(26)లతో రూ.35వేలకు బేరం కుదిర్చాడు. ఇందులోను వారు బంధువులు ఉన్నారు. ఒకరోజు అమిత్ వాషింగ్మిషన్ కొందామని అన్షుల్ను బైక్పై తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న వాళ్లు అమిత్ ద్వారా విషపూరిత కూల్ డ్రింక్ తాగించి, అనంతరం గొంతు నులిమి చంపేశారు.