ఈ కారణంతో విడాకులా?: ఆ భార్య చెబుతున్నది వింటే షాక్ అవాల్సిందే..
పాట్నా: భర్త తనను సినిమాకు తీసుకెళ్లలేదన్న కారణంతో ఇటీవల ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇలాంటిదే.. ఇప్పుడు మరో వింత వార్త. సౌండ్ పొల్యూషన్ ను నివారించడంలో విఫలమయ్యాడన్న కారణంతో ఓ భార్య ఏకంగా భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్దపడింది.
బీహార్ లోని హాజీపూర్, రోడ్ నం.3లో నివాసం ఉండే స్నేహ సింగ్ అనే వివాహిత ఈ నిర్ణయం తీసుకుంది. వీరి ఇంటి చుట్టు పక్కల కొన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. లౌడ్ స్పీకర్లతో వాటి నుంచి వచ్చే శబ్దాలు స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి.
ఈ అసౌకర్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఆఖరికి ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్ లకు సైతం లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేకపోయింది. దీంతో భర్త నుంచి విడిపోవడానికే ఆమె నిర్ణయించుకున్నారు.
కాగా, భర్త రాకేష్తో నాలుగేళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది. తనకు అవసరమైన భద్రతను కల్పించలేని భర్తతో తాను కలిసి జీవించలేనని ఆమె తేల్చి చెప్పారు. ఆమె భర్త రాకేష్ ఓ దివ్యాంగుడు కావడం గమనార్హం. గతంలో అతను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. భార్య విడాకుల ప్రతిపాదనపై స్పందించిన అతను.. శబ్ద కాలుష్యం ఏమి చేయలేని నిస్సహాయతలతో ఉన్నానని తెలిపారు.
పొరుగువారితో తలపడే స్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. విడాకుల వద్దని బంధువులు స్నేహకు నచ్చజెప్పుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ప్రార్థనా మందిరాలపై ఫిర్యాదు చేసినందుకు.. వీరి ఇంటి మీద కొంతమంది దుండగులు రాళ్లు విసురుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.