మోడీనే తిడతావా.. సిద్దూపై చెప్పుతో దాడి చేసిన మహిళ
రోహతక్ : పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. రోహతక్ ఎంపీ అభ్యర్థి దీపేందర్ హుడాకు మద్దతుగా మంగళవారం రాత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఆ వేదికపై సిద్దూ మాట్లాడుతూ మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అక్కడున్న ఓ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఏమీ ఆలోచించకుండా సిద్దూ పైకి చెప్పును విసిరికొట్టింది.
ఎన్నికల ప్రచారంలో మోడీని దొంగగా అభివర్ణిస్తూ ఇంకేదో మాట్లాడబోయారు సిద్దూ. అక్కడే ఉన్న సదరు మహిళకు ఎక్కడా లేని కోపం తెప్పించింది. మోడీకి వ్యతిరేకంగా ఆయనను దూషిస్తారా అంటూ చెప్పు విసిరింది. అయితే మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినా.. గురువారం నాడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిద్దూపై చెప్పుతో దాడి చేసినట్లు ఆ మహిళ స్పష్టం చేశారు. అదలావుంటే సిద్దూపై చెప్పుతో దాడి చేసిన తర్వాత.. అదే వేదిక దగ్గర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు సదరు మహిళ.