కుప్పకూలిన గుడి పైకప్పు, దుర్మరణం: రూ. 5 లక్షల పరిహారం, సీఎం పళనిస్వామి !
చెన్నై: తమిళనాడులో గురువారం ప్రసిద్ది చెందిన ఆలయం పైకప్పు కుప్పకూలిపోవడంతో ఓ భక్తురాలు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆ గుడిలోని భక్తులు ఆందోళనకు గురైనారు.
గుడి చుట్టూ ప్రదక్షణలు
తమిళనాడులోని తుతికోరిన్ జిల్లాలోని తిరుచందూరులో ప్రసిద్ది చెందిన శ్రీ సుబ్రమణ్యస్వామి (మురుగన్ ఆలయం) ఆలయం ఉంది. గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి భక్తులు వెళ్లారు. ఆలయం చుట్టు ఉన్న ప్రాకార మండపంలో భక్తులు ప్రదక్షణలు చేస్తున్నారు.
ఒకే సారి కూలిపోయింది
ఆ సందర్బంలో ఆలయం ప్రకార మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పేచియమ్మాల్ అనే భక్తురాలు మరణించారు.
జిల్లా కలెక్టర్ పరుగు
కందస్వామి, సెంథిల్ ఆర్ముగంకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయం పైకప్పు ఎలా కూలిపోయింది అంటూ విచారణకు ఆదేశించారు.
సీఎం పళనిస్వామి
గుడి పైకప్పు కూలిపోయిందని సమాచారం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. ఆలయం పైకప్పు కూలి మరణించిన పేచియమ్మాల్ రూ. 5 లక్షలు, గాయాలు అయిన వారికి రూ. ఒక లక్ష చొప్పున నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు.