నోట్లో అమర్చిన ఆక్సిజన్ సక్షన్ పైప్ పేలి రోగి మృతి: కారణం తెలిసి విస్తుపోయిన డాక్టర్లు
లక్నో: చావు రాసి పెట్టి ఉంటే ఎలాగైనా కబళించి వేస్తుందంతే! తప్పించుకోవడం అసంభవం. ఇది రుజువని నిరూపించే ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్లోని అలీగఢ్లో చోటు చేసుకుంది. హర్దువా గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మొహల్లా నజీర్ గ్రామంలో నివసించే 40 సంవత్సరాల శీలాదేవి అనే మహిళ కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషం సేవించింది.
వడ్డీ తగాదా: పండ్ల వ్యాపారి దారుణహత్య
ఆమె భర్త చక్రేందు సింగ్తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. మొహల్లా నజీర్ నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన ఆమె విషప్రభావానికి గురై మార్గమధ్యలో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గుర్తించిన స్థానికులు చక్రేందు సింగ్కు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఆయన తన బంధువులు, ఇతర కుటుంబీకులతో కలిసి శీలాదేవిని అలీగఢ్లోని ప్రతిష్ఠాత్మక జేఎన్ వైద్య కళాశాలకు తరలించారు.
ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. విషాన్ని కక్కించడానికి ఐసీయూలో ఉంచి చికిత్స ఆరంభించారు. ఊపిరి తీసుకోవడం కష్టతరం కావడంతో శీలాదేవికి సక్షన్ పైప్ ద్వారా ఆక్సిజన్ పంపించబోయారు. ఆక్సిజన్ సక్షన్ పైప్ను నోట్లో అమర్చిన కొంతసేపటికి పెద్ద శబ్దం చేస్తూ పైప్ పగిలిపోయింది. అంతే! ఈ పేలుడులో ఫలితంగా- శీలాదేవి తల ఛిద్రమైంది. అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘటన మొత్తం ఐసీయూలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన డాక్టర్లను నివ్వెరపోయేలా చేసింది. పేలుడు ఎలా సంభవించిందనే విషయంపై ఆరా తీయగా.. ఆత్మహత్య చేసుకోవడానికి శీలాదేవి సల్ఫ్యూరిక్ యాసిడ్ను తాగారని తేలింది. నోట్లో అమర్చిన పైప్ సహకారంతో ఆక్సిజన్ను శరీరంలోనికి పంపించిన వెంటనే- సల్ఫ్యూరిక్ యాసిడ్ రసాయనిక చర్యకు గురై పేలుడు సంభవించిందని నిర్ధారించారు. ఈ ఘటన డాక్టర్లను విస్తుపోయేలా చేసింది.