దారుణం: ఆమె ప్రమాదంలో మరణించినా ఛార్జీ వసూలు చేసిన క్యాబ్
ముంబై: దాదాపు నెల రోజుల క్రితం ఓ మహిళ క్యాబ్లో వెళ్తుండగా ప్రమాదం జరిగి చనిపోయింది. క్యాబ్లో వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆమె మృతి చెందినప్పటికీ.. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి క్యాబ్ సంస్థ డబ్బులు కట్ చేసుకుంది. చనిపోయిన వ్యక్తి నుంచి కూడా ఛార్జీలు వసూలు చేయడం షాకింగ్కు గురి చేస్తోంది.
జూన్ 14వ తేదీన తంజీలా (35) క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో వెళ్తుండగా బందుప్ వద్ద ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే వద్ద రాంగ్గా పార్క్ చేసి ఉన్న ఓ స్టేషనరీ గార్బేజ్ వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో తంజీలా చనిపోయింది.
ప్రమాదం జరిగి ఆమె రక్తపు మడుగులో ఉన్నప్పటికీ క్యాబ్ డ్రైవర్ భట్టి మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ డ్రైవర్ గతంలోను స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ డ్రైవర్ను అరెస్టు చేసినప్పటికీ మరుసటి రోజే బెయిల్ వచ్చింది.
ఆమె చనిపోయినప్పటికీ ఆమె ఖాతా నుంచి ప్రయాణానికి గాను రూ.548 కట్ అయ్యాయి. ఆమె ట్రిప్ పూర్తి కాలేదు. పైగా మృతి చెందింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఫోన్ చెక్ చేస్తే డబ్బులు కట్ చేసుకున్నట్లుగా గుర్తించారు. దీనిపై క్యాబ్ సంస్థకు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారని తంజీలా భర్త తెలిపారు.
తమ తనయుడు తల్లి కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడని, ఆమె ఫోన్ ఎత్తుతుందేమోనని ప్రతి రోజూ ఆమె ఫోన్ నెంబర్ డయల్ చేస్తున్నాడని భర్త కన్నీరుమున్నీరు అవుతున్నారు. తల్లి మృతిని చిన్నారికి చెప్పలేదన్నారు.
మరోవైపు కేసు దర్యాఫ్తుకు ఇన్సురెన్సు డబ్బులో 21 శాతం వాటాను అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తంజియా బీటెక్ గ్రాడ్యుయేట్. విప్రోలో మేనేజర్ స్థాయిలో పని చేస్తోంది. ఆమె గోరేగావ్ వెళ్లాల్సి ఉండగా.. ఆ పరిస్థితుల్లో క్యాబ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త కాప్జెమినిలో పని చేస్తున్నారు.