పెళ్లి చేసిన పురోహితుడితో పెళ్లి కూతురు జంప్..!
విదిశ : వేదమంత్రాలు, బాజా భజంత్రీలు, బందువుల మధ్య కోలాహలం మధ్య ఆ జంట మే ఏడున ఒక్కటైంది. పురోహితుడు సంప్రదాయబద్దంగా వివాహతంతు పూర్తి చేశాడు. అయితే పెళ్లి జరిగి ముచ్చటగా మూడు వారాలు తిరక్కముందే నవ వధువు మాయమైంది. పెళ్లి చేసిన పురోహితుడు పత్తాలేకుండా పోయాడు. ఏమై పోయారని ఆరా తీస్తే.. ఇద్దరూ కలిసి లేచిపోయారని తెలిసి షాక్ తినడం కుటుంబసభ్యుల వంతైంది.
నవ వధువు మాయం
మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో ఈ ఘటన జరిగింది. విదిశకు చెందిన యువతికి మే 7న ఓ యువకుడితో పెళ్లైంది. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అందరు అమ్మాయిలు కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడితే ఆ వధువు మాత్రం కన్నింగ్ ప్లాన్తో ఎంటరైంది. వివాహానంతరం సంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమాలు పూర్తవ్వగానే అత్తింట్లో ఏవో సాకులు చెప్పి పుట్టింటికి చేరింది. మే 23న ఇంట్లో ఉన్న లక్షన్నర విలువైన నగలు, రూ.30వేలు తీసుకుని ఉడాయించింది.
పత్తాలేకుండా పోయిన పురోహితుడు
ఇదిలా ఉంటే మే 23న యువతి ఊరిలోనే మరో పెళ్లి జరిగింది.సదరు యువతి పెళ్లి తంతు నిర్వహించిన వినోద్ మహారాజ్ అనే పురోహితుడే ఈ పెళ్లి చేయాల్సి ఉంది. ముహూర్తం దగ్గరపడుతున్నా అతని జాడ తెలియకపోవడంతో పెళ్లి వారు అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడని అతని భార్య చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు విషయాన్ని సర్పంచ్ దృష్టికి తెచ్చారు. తమ కుమార్తెను వినోద్ మహరాజ్ తీసుకెళ్లిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై యువతి భర్తతో పాటు పురోహితుడి భార్య పోలీసులకు కంప్లైంట్ చేశారు.
తీగలాగితే కదిలిన డొంక
రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. ముగ్గురు పిల్లల తండ్రిఅయిన వినోద్ మహారాజ్, ఆ యువతితో కలిసి పారిపోయాడని తేలింది. సదరు యువతితో అతనికి రెండేళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పురోహితుడి భార్యకు కూడా ఈ విషయం తెలుసని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు యువతితో పాటు పురోహితుని ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు.