షాకింగ్ : ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. జననాంగాలు చిధ్రం.. పూజారిపైనే అనుమానం?
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ మహిళ గ్యాంగ్ రేప్కి గురైంది. అత్యంత పాశవికంగా దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి గాయపర్చడంతో పాటు పక్కటెముకలను విరిచేసినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. తాజా ఘటన 8 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపిస్తోంది. ఆలయ పూజారి,అతని శిష్యులే ఈ అత్యాచారానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయానికి వెళ్లిన మహిళ...
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లా ఉఘాటికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ఆదివారం(జనవరి 3) సాయంత్రం ఓ ఆలయానికి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అర్ధరాత్రి 12గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఆ ఇంటి తలుపు తట్టారు. 'మీ భార్య బావిలో పడి తీవ్ర గాయాలపాలైంది. కారులో తీసుకొచ్చాం.' అని చెప్పి భర్తకు అప్పగించారు. మరుక్షణం అక్కడినుంచి హుటాహుటిన వెళ్లిపోయారు.
తీవ్ర గాయాలతో మృతి...
కుటుంబ సభ్యులకు అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. ఇంతలోనే తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. ఆమె శరీరంపై,జననాంగాలపై తీవ్ర గాయాలు కనిపించాయి. ఈ ఘటనపై ఉఘాటి పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.అయితే పోలీసులు వారి ఫిర్యాదు పట్ల అలసత్వంగా వ్యవహరించారు. బాధితురాలు చనిపోయిన 18గంటల తర్వాత గానీ ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించలేదు.
జననాంగాలపై తీవ్ర గాయాలు...
పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. ఆమె జననాంగాలను చిధ్రం చేసినట్లుగా నిర్దారించారు. శరీరమంతా గాయాలున్నట్లు చెప్పారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ తర్వాత గానీ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
బాధితురాలిని కారులో ఆమె ఇంటికి తీసుకొచ్చిన పూజారి,అతని శిష్యులే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 376d(గ్యాంగ్ రేప్),302(హత్య) కింద వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.