దారుణం: చెట్టుకు కట్టేసి భర్త ఎదుటే భార్యపై ఐదుగురు గ్యాంగ్రేప్
నమక్కల్: తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాసిపురం సమీపంలో ఓ మహిళపై ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
షాపింగ్ చేసుకొని తిరిగి తన భర్తతో ఇంటికి వస్తున్న సమయంలో వారిని అడ్డగించిన ఐదుగురు నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ‘ఆ దుండగులు సదరు దంపతులపై దాడి చేశారు. మహిళ భర్తను చెట్టుకు కట్టేసి.. అతని ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు' అని నమగిరిపెట్టాయి పోలీసులు తెలిపారు.
బాధిత మహిళ బంధువులు, ఇరుగుపొరుగు వారు నమక్కల్ జిల్లా ఎస్పీ ఎస్ఆర్ సెంథిల్ కుమార్ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన నమగిరిపెట్టాయి పోలీసులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, మంగళవారం ఉదయం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నమగిరిపెట్టాయి పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.