మరో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ నగర శివారులో కదులుతున్న బస్సులో ఓ వివాహితపై బస్సు డ్రైవర్, అతని సహాయకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాధితురాలి పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం రాత్రి బాధితురాలు దాద్రి వెళ్లేందుకు కనౌజ్ దగ్గర బస్సు ఎక్కింది. అయితే గమ్యస్థానం చేరినా ఆమె గుర్తించకపోవడంతో ఢిల్లీ చేరింది. అయితే బాధితురాలిని దాద్రిలో దించుతామని చెప్పిన బస్సు డ్రైవర్, అతని సహాయకుడు బస్సులో వెనక్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
అసోం రోడ్డు ప్రమాదంలో 12మంది దుర్మరణం
జోర్హాట్: అసోంలోని గోల్ఘాట్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. లఖింపూర్ జిల్లా ధకువాఖానా నుంచి దేర్గాంవ్కు వెళ్తున్న ఒక వాహనం లోటబరి వద్ద జాతీయ రహదారి-37పై ఒక భారీ ట్రక్కును ఢీకొనడంతో వీరంతా అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు దంపతులు ఉన్నారు. అయితే ఈ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి బయటకు దూకినప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను జోర్హాట్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.