స్కూల్ వ్యాన్లో బాలికపై రేప్: మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్
ఇండోర్/ ముజఫర్నగర్: వ్యాన్లో ఐదేళ్ల బాలికపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో వాహనం డ్రైవర్ అత్యాచారం చేశాడు. డ్రైవర్ అజయ్ సోలంకి (25)ని పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ పోలీసు సూపరింటిండెంట్ ఆబిద్ ఖాన్ ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిల్లలందరినీ దింపిన తర్వాత అమ్మాయి ఒక్కతే వ్యాన్లో ఉంది. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై డ్రైవర్ సోలంకి అత్యాచారం చేశాడు.
ఇంటికి చేరుకున్న తర్వాత బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండోర్లోని ఎరోడ్రమ్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఆ సంఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కడ్లీ గ్రామంలో 30 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ తన మరిదితో కలిసి గ్రామానికి వస్తుండగా, ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. మరిది వద్ద ఉన్న 35 వేల రూపాయలను దోచుకున్నారు. పక్కనే ఉన్న చెరుకు తోటలోకి తీసుకుని వెళ్లి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.