మోడీ సభలో పాల్గొన్న భార్య.. తలాక్ చెప్పిన భర్త!
లక్నో: బీజేపీ ర్యాలీలో పాల్గొందనే కారణంతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పిన ఉదంతమిది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పైగా అతడు ఆమెను ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... బరేలీ పట్టణానికి చెందిన దానిష్, ఫరా ప్రేమించుకుని గత ఏడాది ఏప్రిల్లో పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ కేంద్రమంతి ముక్తార్ అబ్బాస్ నక్వీ సోదరి, సామాజిక కార్యకర్త అయిన ఫర్హాత్ నక్వీ శుక్రవారం నిర్వహించిన ధన్యవాద్ ర్యాలీకి ఫరా హాజరుకావడం ఆమె కొంప ముంచింది.
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిన మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు తాను ఆ ర్యాలీకి హాజరయ్యానని, కానీ ర్యాలీ నుంచి ఇంటికి రాగానే తన భర్త దానిష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలాక్ చెప్పి తనను బయటకు గెంటేశాడని ఫరా వాపోయింది.
అయితే ఈ విషయంలో ఆమె భర్త దానిష్ వాదన మరోలా ఉంది. ఫరా జీన్స్ ధరిస్తోందని, వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నట్టు అనుమానం రావడంతోనే ఆమెకు తలాక్ చెప్పానని అతడు అంటున్నాడు.
మరోవైపు ట్రిపుల్ తలాక్ విషయమై బాధితురాలు ఫరా పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేయలేదు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సోదరి ఫర్హాత్ నక్వీ దృష్టికి తీసుకెళ్లారామె. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆమె ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.