తొలిసారి: ‘శని’ ఆలయ అధ్యక్షురాలిగా మహిళ
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న శని శింగనాపూర్ ఆలయం 5 శతాబ్దాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ చైర్పర్సన్గా సోమవారం నియమితులయ్యారు. గృహిణి అనితా షీతే(40)కు శని శింగనాపూర్ ఆలయ ట్రస్టు బాధ్యతలు అప్పగించారు.
ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఈ కమిటీలో 11 మంది ధర్మకర్తల్లో మరో మహిళ కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలోపలకు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడానికి ఇటీవల ప్రయత్నం జరిగినప్పుడు ఘర్షణ చోటుచేసుకొంది.
ఆలయంలో ఓ మహిళ ప్రవేశించినందుకు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమయింది. అయిదు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధం కొనసాగేలా చూస్తాననీ, గర్భాలయంలోకి మహిళల్ని అనుమతించే ఆలోచనే లేదని అనితా షీతే మీడియాకు స్పష్టం చేశారు.
సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు ఆలయ వేదిక మీదికి వచ్చి పూజలు చేయడంతో ఈ ఆలయం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. శని ఆలయంలో ‘చౌతారా'(శని విగ్రహం) వద్ద పూజలు చేసేందుకు పురుషులనే అనుమతిస్తారు. మహిళలు శని విగ్రహానికి తైలపూజ చేసే సంప్రదాయం ఇప్పటివరకు లేదు.