వివాహేతర బంధం: ఖర్చులకు డబ్బివ్వలేదని ప్రియుడ్ని దారుణంగా చంపేసిన యువతి
నోయిడా: వివాహితుడైన వ్యక్తిని ప్రేమించడమేగాక, ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని అతడ్ని దారుణంగా హత్య చేసిన యువతిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధానికి దారితీసిన పరిచయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు సోనమ్ అలియాస్ సోను(23), బాధితుడు జితేంద్ర(37)లు ధన్కౌర్లోని లోడిపుర గ్రామానికి చెందిన వారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల క్రితం సోనమ్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగించారు.
డబ్బులివ్వనని చెప్పడంతో యువతి బెదిరింపులు
ఈ క్రమంలో ఇటీవల వారిమధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అతని భార్యకు పంపిస్తానంటూ సోనమ్.. జితేంద్రను బెదిరింపులకు గురిచేసింది. అయితే, తాను డబ్బులివ్వనని చెప్పడంతో అతనిపై సోనమ్ కోపం పెంచుకుంది.
దారుణంగా చంపేసింది
జితేంద్రను హత్య చేయాలని కుట్ర పన్నిన సోనమ్.. బిలాస్పూర్ ప్రాంతానికి రావాలని అతనికి ఫోన్ చేసి కోరింది. జితేంద్ర తన వద్దకు రాగానే మంచంకోళ్లతో అతని తలపై పలుమార్లు బాదింది సోనమ్. దీంతో జితేంద్ర కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. సోనమ్ అక్కడ్నుంచి పరారైంది.
సోదరుడి ఫిర్యాదుతో..
ఈ నేపథ్యంలో జితేంద్రను ఎవరో చంపారని, తమకు సోనమ్పై అనుమానం ఉందని జితేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు సోనమ్ను అరెస్ట్ చేశారు. జితేంద్రను హత్య చేసేందుకు ఉపయోగించిన మంచం కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.