టాయిలెట్ నిర్మాణం నిలిపివేసినందుకు!: కర్నాటకలో మహిళ ఆత్మహత్యాయత్నం..
బెంగళూరు: మునుపటి రోజుల్లా కాదు. తెల్లవారుజామునే ముఖం మీద కొంగు కప్పుకుని ఆరుబయటకు వెళ్లే అలవాటుకు మహిళలు స్వస్తి చెబుతున్నారు. ఆత్మగౌరవంగా బతకడానికే వారు ఇష్టపడుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం ఊపందుకుంది.
అయితే విచిత్రంగా కొన్నిచోట్ల ప్రభుత్వం నుంచే దీనికి మద్దతు కరువవుతుండటం గమనార్హం. తాజాగా కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని ఓ గ్రామంలో.. అధికారులు మరుగుదొడ్డికి నిధులు విడుదల చేయలేదన్న కారణంతో ఓ వివాహిత(21) ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
స్వచ్చభారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్డికి నిధులు విడుదలయ్యాయి. మొదట్లో నిర్మాణానికి నిధులు విడుదల చేసిన గ్రామ పంచాయితీ.. ఆ తర్వాత సరైన పత్రాలు లేవన్న కారణంతో నిర్మాణాన్ని నిలిపివేసింది. దీంతో మనస్తాపం చెందిన వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
వివాహిత చర్యతో షాక్ తిన్న అధికారులు అక్కడినుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దావణగెరెలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంటే.. అధికారులు మాత్రం ఇలా అడ్డుపడటమేంటని వారు ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.