కేంద్ర బడ్జెట్ 2019 : మహిళా సాధికారతకు పెద్దపీట.. ముద్ర స్కీం ద్వారా లక్ష రుణం...
ఢిల్లీ : స్త్రీని దేవతగా పూజించే భారత దేశంలో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వారు అన్ని రంగాల్లో దూసుకుపోయేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చింది. నారీ నారాయణి ద్వారా మహిళల పురోగతిపై దృష్టి పెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది.
మహిళా భాగస్వామ్యంతోనే పురోగతి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోందన్న ఆమె... స్వామి వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. పార్లమెంటులో 78మంది మహిళా ఎంపీలున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ముద్ర పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు, మహిళా పారిశ్రామిక వేత్తలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.
స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ముద్ర స్కీం కింద స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు లక్ష రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు జన్ధన్ ఖాతాలు కలిగిన మహిళలకు రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.