ఫేస్బుక్ ఫ్రెండ్ కదాని ఇంటికి పిలిస్తే.. వాడేం చేశాడో తెలుసా?
చెన్నై: ఓ యువతి ఫేస్బుక్లో పరిచయమైన స్నేహితుడ్ని ఇంటికి ఆహ్వానించింది. నమ్మకంగా ఇంటికొచ్చిన అతడు అర్ధరాత్రి వేళ ఆమె మెడలో గొలుసు దొంగిలించి పరారయ్యాడు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.
చెన్నైలోని రెడ్హిల్స్కు చెందిన నిత్య(25) వివాహిత. ఆమెకు ఫేస్బుక్లో పళనికి చెందిన మనోజ్కుమార్(22) అనే యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం స్నేహంగా మారింది. ఆ తరువాత కొద్దిరోజులకు అతడు నిత్యను వ్యక్తిగతంగా కలుసుకుని ఆమెకు మరింత దగ్గరయ్యాడు.
మరోవైపు ఈ నెల 9వ తేదీన నిత్య మెడలోని గొలుసు పోయింది. ఆమె భర్త మురుగన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా పోలీసులకు నిత్యపై అనుమానం వచ్చింది. దీంతో వారు ఆమె ఫోన్కు సంబంధించిన కాల్ రికార్డులను పరిశీలించారు.
ప్రతిరోజూ రాత్రి పొద్దుపోయే వరకూ ఆమె మనోజ్ అనే యువకుడితో మాట్లాడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. నిత్య ఇంట్లో గొలుసు చోరీకి ముందు రోజు కూడా వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఆరోజు మనోజ్ను తమ ఇంటికి రమ్మని నిత్య పిలిచింది. అతడు వచ్చాడు కూడా.
కానీ అదే రోజు అర్ధరాత్రి వేళ ఆమె మెడలో గొలుసు దొంగిలించి మనోజ్ పరారయ్యాడు. మర్నాడు తన మెడలో గొలుసులేకపోవడం గమనించిన నిత్య తన భర్తకు చెప్పింది. తాను బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తన గొలుసు లాక్కుపోయాడంటూ ఆమె నమ్మబలికింది.
కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించేసరికి మొత్తం జరిగినదంతా వారి దృష్టికొచ్చింది. మనోజ్ను అరెస్టు చేసిన పోలీసులు... ఇలాంటి చోరీలు చేయడం అతడికి అలవాటుగా మారినట్టు వెల్లడించారు. ఫేస్బుక్ ద్వారా అమాయకులకు దగ్గరవుతాడనీ... నమ్మకం కుదిరాక వారిని కలుసుకుని నిలువునా దోచుకుంటాడని పేర్కొన్నారు. అనంతరం బాధితులను తన ఖాతాలో నుంచి తొలగించి, వారి ఐడీలను బ్లాక్ చేస్తాడని వివరించారు.