కాఫి తోటలో ఏనుగు దాడి: మహిళ దుర్మరణం
కోడగు: కాఫి తోటలో పని చెయ్యడానికి వెళుతున్న కూలీల మీద మదపుటేనుగు దాడి చేసింది. నిస్సహాయ స్థితిలో చిక్కిన మహిళను దారుణంగా చంపేసింది. ఏనుగు దాడిలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలోని కోడగు జిల్లా వీరాజపేట తాలుకాలోని గోయ్యా గ్రామంలో కమలమ్మ (35), వాసంతి తదితరులు నివాసం ఉంటున్నారు. వీరు అదే గ్రామం సమీపంలోని కాఫీ ఎస్టేట్ లలో కూలి పని చేస్తుంటారు. బుధవారం ఉదయం కమలమ్మ తదితరులు కాఫి తోట దగ్గరకు బయలుదేరారు.
మార్గం మధ్యలో ఏనుగు ఒక్క సారిగా వీరి మీద దాడికి పాల్పడింది. తొండంతో కమలమ్మను ఎత్తి కిందకు వేసి దాడి చేసింది. తరువాత మిగిలిన కూలీల మీద దాడి చేసింది. కాఫి తోటను ధ్వంసం చేసింది. తరువాత అక్కడి నుండి సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వీరాజపేటలోని ఆసుపత్రికి తరలించారు. వాసంతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆహారం కోసం కాఫి తోటలోకి వచ్చిన ఏనుగు కూలీల మీద దాడి చేసిందని పోలీసులు తెలిపారు.