చిత్రహింసలు భరించలేక భర్తను చంపిన మహిళ..తలతో పోలీస్ స్టేషన్కు...!
అస్సోం: భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తెగించి అతన్ని హత్య చేసింది. ఆ వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది . ఈ ఘటన అస్సోంలోని లఖీంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మాజ్గాన్లో నివసించే గుణేశ్వరి బరకతకి అనే మహిళ మంగళవారం రాత్రి ధాల్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. ఆమె చేతిలో ఓ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. దానికి రక్తపు మరకలు అంటి ఉండగా పోలీసులు ఆ బ్యాగ్లో ఏముందని అడిగారు. తన భర్త ముధిరామ్ను చంపి ఆయన తలను ఈ బ్యాగులో తీసుకొచ్చినట్లు పోలీసులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
గత కొన్నేళ్లుగా రోజు తనను కొడుతున్నాడని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని గుణేశ్వరి పోలీసుల ముందు భోరున విలపించింది. కొన్ని సందర్భాల్లో గొడ్డలితో కూడా తనపై దాడి చేశాడని మహిళ పోలీసులకు తెలిపింది. అతన్ని విడిచి ఎప్పుడో వెళ్లిపోయేదాన్నని కానీ తన పిల్లల ముఖం చూసి ఆగిపోయినట్లు చెప్పింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన్ను అంతమొందించాల్సి వచ్చిందని లేకపోతే తనను చంపేవాడని గుణేశ్వరి స్థానిక మీడియాకు తెలిపింది.
గుణేశ్వరి దంపతులకు ఐదుగురు సంతానం. ఇందులో ఇద్దరు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మచ్చుకత్తితో భర్తను హత్య చేసిన గుణేశ్వరి..తలను వేరు చేసి ప్లాస్టిక్ బ్యాగులో వేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వచ్చింది. గుణేశ్వరి భర్తను చంపి తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యిందని... తన భర్త ప్రతిరోజు మద్యం సేవించి తనపై దాడి చేసేవాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుణేశ్వరిని స్థానిక కోర్టులోహాజరుపర్చగా ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.