ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియుడితో కలిసి తల్లినే చంపేసింది
పాటియాల: తను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదని.. ఓ దుర్మార్గురాలు(23) తన ప్రియుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలోని కంబౌన్ గ్రామంలో చోటు చేసుకుంది.
కాగా, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి శకుంతలా దేవి(50)ని తానే హత్య చేసినట్లు నిందితురాలు సోనియా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాను ప్రేమించిన కుల్వీందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోనందుకే ఈ పని చేశానని సోనియా తెలిపింది. కాగా, అంతకుముందు పోలీసులను, బంధువులను తప్పుదారి పట్టించేందుకు ఓ కట్టుకథ చెప్పింది. తన తల్లి ఎవరో ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని, డబ్బు కూడా తీసుకెళ్లిందని సోనియా నమ్మించే ప్రయత్నం చేసింది.
జూన్ 5వ తేదీ రాత్రి శంకుతలా దేవిని హత్య చేసిన సోనియా, కుల్వీందర్, అనంతరం ఆమె మృతదేహాన్ని దగ్ధం చేశారు. కాగా, ఇంటర్వ్యూ కోసం మధ్యప్రదేశ్ వెళ్లిన శకుంతలా దేవి చిన్న కొడుకు సోహల్ లాల్ ఇంటికి వచ్చే సరికి.. సోనియా పై కట్టుకథ చెప్పింది.
అనుమానం వచ్చిన సోహల్ పోలీసులను ఆశ్రయించాడు. తాను వెళ్లే సమయానికి ఇంట్లో తన తల్లి శకుంతలా దేవి, సోదరి సోనియా మాత్రమే ఇంట్లో ఉన్నారని, సోనియా చెప్పిన మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో విచారణ జరిపిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. సోనియా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితులిద్దర్నీ ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పూడ్చిపెట్టిన శకుంతలా దేవి మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.