దారుణం: ఆసుపత్రి కారిడార్లోనే గర్భిణి ప్రసవం, శిశువు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పుట్టిన శిశువు చనిపోయింది. బాలింతకు కనీసం స్ట్రెచర్ ఇవ్వకుండా ఆసుపత్రిలో కారిడార్లోనే బలవంతంగా నడిపించడం వల్ల కింద పడి పుట్టిన శిశువు మరణించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నీల్ వర్మ అనే మహిళా డెలీవరీ కోస్ ఆసుపత్రికి వచ్చింది. అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. అయితే ఆమెకు స్ట్రెచర్ ఇవ్వకుండా బలవంతంగా నడిపించారు.తాను నడిచే పరిస్థితిలో కూడ లేనని ఆమె చెప్పినా కూడ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
డెలీవరి రూమ్ కు తీసుకెళ్ళే సమయంలోనే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయని ఆసుపత్రి కారిడార్లోనే శిశువు జన్మించి నేలపడి మరణించినట్టు బాధితురాలి భర్త వికాస్ వర్మ చెప్పారు.అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండ్ సీరియస్ అయ్యారు. ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు.