పైశాచికం: ప్రేమ జంటను నగ్నంగా ఊరేగించారు, కారణం ఎంటంటే?
జైపూర్: దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. అవగాహన, బాధ్యతలేని మూర్ఖపు జనాలు ఘోరాలకు కారణమవుతున్నారు. ఓ తప్పుడు వాట్సప్ సందేశం దేశంలో 29మంది ప్రాణాలు తీసిందంటే ఇలాంటి జనాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోంది.
తాజాగా, రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన చెందిన యువకుడు మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడి గ్రామస్తులు ఆ జంటకు తీవ్రమైన శిక్ష విధించారు.
ఆ జంటను పట్టుకుని దుస్తులన్నీ విప్పించారు. ఆ తర్వాత అలాగే వారిని గ్రామంలో ఊరేగించారు. అయితే, ఆ జంటను కాపాడేందుకు ముందుకు రాకపోగా, వారిని ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు పైశాచిక ఆనందాన్ని పొందారు అక్కడి జనాలు.
చివరకు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆ మూర్ఖుల బారి నుంచి ప్రేమజంటను కాపాడారు. ఈ దారుణ ఘటన ఉదయ్పూర్లోని సుఖేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.