ఆమెను రోడ్డుపై 2 గంటలపాటు నగ్నంగా నడిపించారు
భోపాల్: మధ్య వయస్సు గల ఓ మహిళను వివస్త్రను చేసి, నడిరోడ్డు పైన నడిపించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్లోని లాహర్లో జరిగింది. అంతేకాదు, ఆమె జుత్తును కూడా కత్తిరంచారు. అందరిముందే రెండు గంటల పాటు నగ్నంగా నడిపించారు.
లాహర్ నగరంలోని వార్డు నంబరు 14లో నివాసముంటున్న ఓ యువకుడు తన ఎదురింట్లో ఉండే ఓ యువతిని ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా కోర్టులో ఈ పెళ్లి జరిగింది. అనంతరం బుధవారం సదరు యువతి తల్లిదండ్రులు బంధువులతో సహా తమ కుమార్తె ఇంటికి వచ్చారు.
ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి(భర్త)ని, బావను, అక్కను చితకబాదారు. ఆమె అత్తను వివస్త్రను చేసి, రోడ్డు పైన రెండు గంటలపాటు నగ్నంగా నడిపించారు. ఆమె నడుస్తున్న సమయంలో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళను గ్వాలియర్ ఆసుపత్రిలో చేర్పించారు.