ఆర్టీసీ బస్సులో మంటలు: మహిళ సజీవ దహనం, నలుగురికి తీవ్రగాయాలు
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. వివరాల్లోకి వెళ్తే... చిక్మంగళూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఇంజిన్లో లోపంతో మంటలు చెలరేగాయి.
అర్ధరాత్రి అంతా నిద్దురలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు అప్రమత్తమై మంటల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి దూకి తప్పించుకున్నారు.
ఒక మహిళ ఈ మంటల్లో సజీవ దహనమైపోయింది. మరో నలగురు ప్రయాణికులు మంటల ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
కాగా, అందరూ చూస్తుండగా బస్సు మంటల్లో కాలి బూడిదైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు.