సహజీవనం చేస్తున్న మహిళను వదిలించుకునేందుకు ఏం చేశాడంటే..?
వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తానంటూ అతను ఆమెను వెంట బెట్టుకుని ఉత్తరాఖండ్ తీసుకెళ్లాడు. ఇంతలో ఏమైందో తెలియదుగానీ మాయలతో నమ్మించిన అతను ఆమెను ఓ ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఉన్మాదిలా మారి ఆమెను లోయలోకి తోసేశాడు. దీంతో తీవ్రగాయాలపాలై స్పృహ కోల్పోయిన ఆమె మరుసటి రోజు స్థానికుల సాయంతో హాస్పిటల్లో చేరింది.
ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఉత్తరాఖండ్కు చెందిన బీరేంద్ర పట్వాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ కోరడంతో ఉత్తరాఖండ్లోని తన కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానంటూ ఆమెను బీరేంద్రను నమ్మించాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని అద్వానీ గ్రామానికి ట్యాక్సీలో బయలు దేరారు.
గ్రామానికి సమీపంలో ట్యాక్సీ దిగిన ఇద్దరు ఇంటికి వెళ్లేందుకు ఓ ఎత్తైన ప్రదేశాన్ని దాటాల్సి ఉంది. అలా కొండపైకి ఎక్కుతుండగా బీరేంద్రలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను వదిలించుకునేందుకు అప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న దుర్మార్గుడు ఆమెను ఒక్కసారిగా లోయలోకి తోసేశాడు. ఆ తర్వాత పత్తాలేకుండా పోయాడు. లోయలో పడిన మహిళ తీవ్రగాయాల పాలై స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు తేరుకున్న ఆమె కేకలు విన్న స్థానికులు లోయలోకి దిగి ఆమెను కాపాడారు.
ఒంటి నిండా గాయాలతో ఉన్న సదరు మహిళను స్థానికులు అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు, కాళ్లు, చేతుల్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు వెళ్లి విషయం తెలుసుకున్నారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న బీరేంద్ర కోసం గాలింపు చేపట్టారు.