దారుణం: ఒంటరిగావున్న మహిళపై ఎస్ఐ రేప్, మరొకరు కూడా
బాఘపత్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ గర్భిణి మహిళపై బాధ్యత మరచిన ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బదౌత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎస్ఐని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
గురువారం రాత్రి ఓ ఇంట్లోకి వెళ్లిన నిందిత ఎస్ఐ హరేంద్ర, మరో గుర్తు తెలియని వ్యక్తి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శరద్ సాచన్ తెలిపారు.
నిందిత ఎస్ఐని అరెస్ట్ చేశామని, విధుల నుంచి తొలగించామని ఆయన చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.
మైనర్ బాలికను కాల్చి చంపేశారు
బరేలీ: ఓ మైనర్ బాలిక(14)ను అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సిర్సా గ్రామంలో ఉంటున్న ఆ బాలికను ఓం వీర్, రవీంద్ర అనే ఇద్దరు యువకులు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
గురువారం సాయంత్రం ఆ బాలిక బయటకు వెళ్లిన సమయంలో అలిగంజ్ ప్రాంతంలో మరోసారి వేధించసాగారు. ఈ క్రమంలోనే వారి వద్ద ఉన్న తుపాకీతో ఆ బాలికపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించి ఓం వీర్ అనే యువకుడ్ని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన మరో యువకుడు రవీంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.