కోర్టుకెళ్తే..నిలువునా తగులబెడతాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి కరపత్రం..!
లక్నో: వరుస అత్యాచారాలు, హత్యోదంతాలతో అట్టుడుకిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళ్తే.. ఉన్నవ్ తరహాలో కిరోసిన్ పోసి, నిలువునా తగులబెడతామని అత్యాచార బాధితురాలికి హెచ్చరించారు నిందితులు. ఈ మేరకు వారు బాధిత యువతి ఇంటికి కరపత్రాలను అతికించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉన్నవ్ అత్యాచార మృతురాలి కుటుంబానికి గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం: ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు
బాగ్ పట్ జిల్లాకు చెందిన బాధిత యువతి కొన్నేళ్లుగా దేశ రాజధానిలోని ముఖర్జీ నగర్ లో నివసిస్తోంది. గత ఏడాది అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో బాధిత యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి, న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.
ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. విచారణలో భాగంగా- బాధిత బాలిక శుక్రవారం న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిందితులు దుస్సాహసానికి ఒడిగట్టారు. న్యాయస్థానానికి హాజరు కావడానికి వెళ్తే.. దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉన్నవ్ కంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఉన్నవ్ బాధితురాలి తరహాలో మార్గమధ్యలోనే కిరోసిన్ పోసి తగులబెడతామని అంటూ.. బాధితురాలి ఇంటికి కరపత్రాలను అతికించారు.
వాటిని చూసిన వెంటనే- బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాగ్ పట్ జిల్లా బాధితురాలి గ్రామానికే చెందిన సోహన్ సింగ్ అనే యువకుడిని అరెస్టు చేశామని డీసీపీ గోపేంద్ర తెలిపారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బాధితురాలికి కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయస్థానాకి తీసుకెళ్తామని చెప్పారు.