బ్యాగ్లో స్త్రీ శవం: రేప్ చేసి, హత్య చేశారా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. యువతిపై అత్యాచారం చేసి తరువాత హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగ్ లో కుక్కిపడేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ రిక్షాలో ఓ మహిళ శవం బయటపడిన విషయం తెలిసిందే.
అనుమానాస్పద స్థితిలో కనపడిన బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేసిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో బుధవారం రాత్రి ఇ-ఆటో రిక్షా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న విషయాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు.
అందులో ఓ బ్యాగ్ ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తున్న విషయం పోలీసులు గుర్తించారు. వెంటనే బ్యాగ్ తీసి చూడగా యువతి మృతదేహం బయటపడింది. యువతిని అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
24 గంటల ముందే హత్య జరిగి ఉంటుందని గురువారం పోలీసులు అన్నారు. యువతి జీన్స్ ప్యాంట్, కుర్తా, మెడకు స్కార్ఫ్ ధరించిందని పోలీసులు అన్నారు. అంతకు మించి మరే సమాచారం లేదని పోలీసులు అంటున్నారు.
అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో రిక్షా డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తాను మెట్రో రైల్వే స్టేషన్ కు వెళ్లాలని చెప్పి బ్యాగ్ ఆటోలో పెట్టాడని, తరువాత తాను వెనుక బైక్ లో వస్తానని తనతో చెప్పాడని ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.
కిరాయి మాట్లాడుకుని ఆటోలో వెనుక బయలుదేరిన వ్యక్తి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారని ఆటో డ్రైవర్ అంటున్నాడు. అయితే అత్యాచారం, హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.