ఆశ్రమంలో యువతి మృతి: నిత్యానందతో పాటు రంజితకు చిక్కులు
బెంగళూరు: వివాదాస్పద నిత్యానంద స్వామీ, ఆయన శిష్యురాలు, ప్రముఖ సినీ నటి రంజిత తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగుళూరు బిడది ఆశ్రమంలో తిరుచ్చికి చెందిన మరో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
తమ కుమార్తె మృతికి నిత్యానంద, రంజితలే కారణమంటూ మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తిరుచ్చికి చెందిన ఝాన్సీరాణి, ఆమె కుమార్తె సంగీత నిత్యానంద ఆశ్రమంలో సంఘ సేవకురాళ్లుగా పని చేశారు. ఝాన్సీరాణికి మరో సంస్థలో ఉద్యోగం రావడంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టారు.
అయితే సంగీత మాత్రం ఆశ్రమంలోనే సేవలందిస్తూ వచ్చారు. గత నెల 28వ తేదీన ఆశ్రమంలో సంగీత మరణించినట్లు సమాచారం తెలిసి ఝాన్సీరాణి అక్కడికి వెళ్లి, పోస్టుమార్టం ముగిసిన అనంతరం కుమార్తె భౌతికకాయాన్ని 30వ తేదీన తిరుచ్చికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
కుమార్తె శరీరంపై ఉన్న గాయాలను చూసి దిగ్ర్భాంతికి చెందారు. దీనిపై తిరుచ్చి రాంజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తె భౌతిక కాయానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా కోరారు. అయితే సంగీత బెంగళూరులో మృతి చెందినందువల్ల ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసినట్లు రాంజీనగర్ పోలీసులు తెలిపారు.
కాగా, నిత్యానంద ఆశ్రమంలో 24 ఏళ్ల యువతి మృతదేహం బయటపడింది. దీనిని ప ోలీసులు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ యువతి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్టు మార్టం నివేదిక ద్వారా అసలు విషయాలు బయటపడుతాయని వారన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని వారు డిమాండ్ చేశారు. తమ కూతురు గత నాలుగేళ్ల నుంచి ఆశ్రమంలో ఉంటోందని, ఆమెకు ఏ విధమైన అనారోగ్యం లేదని వారు అప్పుడు చెప్పారు. తమ కూతురు ఉన్నట్లుండి మరణించడం అనుమానాలకు తావు ఇస్తోందని వారన్నారు.