మహిళ ఇంటికి నిప్పుపెట్టిన స్థానికులు, కుటుంబానికి తప్పిన ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ చిచ్చు చల్లారడం లేదు. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో స్థానికులు రెచ్చిపోయారు. ఓ మహిళ ఎన్ఆర్సీ సమాచారం సేకరిస్తుందనే అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టి తమ కోపాగ్ని చూపించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇంటికి నిప్పు..
బీర్బుమ్ జిల్లా గౌర్బజార్ గ్రామంలో ఓ 20 ఏళ్ల చుమ్కి ఖాతున్ అనే యువతి ఇంటికి కొందరు నిప్పుపెట్టారు. ఆమె జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారనే అనుమానంతోనే ఘాతుకానికి తెగబడ్డారు. ఉద్వేగానికి లోనైన స్థానికులు ఆమె ఇంటికి నిప్పు అంటించారు. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తర్వాత చుమ్కి ఖాతున్ కుటుంబం పోలీసుల రక్షణ మధ్య ఉంటోంది. చుమ్కి ఖాతున్ ఇల్లు దహనానికి ఎన్ఆర్సీకి సంబంధం లేదని పోలీసులు చెప్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్జీవోలో జాబ్
ఒక ఎన్జీవో సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా చుమ్కి పనిచేస్తున్నారు. ఎన్జీవో సంస్థ గ్రామీణ మహిళలు స్మార్ట్ ఫోన్ వినియోగించుకునేలా శిక్షణ ఇస్తోంది.. ఇందులో భాగంగా శిక్షణకు సంబంధించిన సమాచారాన్ని చుమ్కి సేకరించారని స్థానికుల ద్వారా తెలుస్తోంది. దీనినే వారు ఎన్ఆర్సీకి సంబంధించిన సమాచారం అనుకొని ఇంటికి పెట్టారని ప్రాథమికంగా తెలుస్తోంది.
అదేం లేదే..
చుమ్మి ఇంటికి స్థానికులు నిప్పుపెట్టడానికి ఎన్ఆర్సీ డేటాతో సంబంధం లేదని రామ్పుర్హాత్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సౌమాజిత్ బారువా పేర్కొన్నారు. గ్రామంలో చుమ్కి కుటుంబానికి ఇతరులతో శత్రుత్వం ఉండొచ్చని, అందుకే వారు నిప్పంటించి ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని, ఎంక్వైరీలో నిజనిజాలు వెలుగుచూస్తాయని చెప్పారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు.