బాత్రూమ్కు వెళ్లిన మహిళను రహస్యంగా వీడియో: రైల్లో తస్మాత్ జాగ్రత్త!
వెంటనే విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పడంతో.. అంతా కలిసి సలీం వద్ద తనిఖీలు చేశారు. దీంతో అతని మొబైల్లో పలువురి మహిళల అర్థనగ్న వీడియోలు కనిపించాయి.
ముంబై: ఇల్లు, రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలు అన్న తేడా లేకుండా మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొబైల్ కెమెరాలు వచ్చిన తర్వాత.. ఎక్కడ ఎవరు తమను ఏ రీతిలో బంధిస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి రైల్లో బాత్రూమ్ ల్లోను కొంతమంది కీచకులు కెమెరాలతో వెంటాడుతున్నారు.
తాజాగా లోక్ మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణించిన ఓ 50ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. థానే నగరానికి చెందిన ఆమె.. ఎ-1 ఏసీ కోచ్ లో ప్రయాణిస్తూ.. మూత్ర విసర్జన కోసం బాత్రూమ్ వెళ్లింది. ఇది గమనించిన షేక్ సలీం అనే రైల్వే ఉద్యోగి.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి రహస్యంగా వీడియో తీశాడు. ఇంతలో మొబైల్ అలారం మోగడంతో.. తననెవరో రహస్యంగా చిత్రీకరిస్తున్నారన్న విషయాన్ని మహిళ కనిపెట్టేసింది.
వెంటనే విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పడంతో.. అంతా కలిసి సలీం వద్ద తనిఖీలు చేశారు. దీంతో అతని మొబైల్లో పలువురి మహిళల అర్థనగ్న వీడియోలు కనిపించాయి. దీంతో రైల్వే కంట్రోల్ రూమ్ అధికారులకు సమాచారం అందించారు.ఝాన్సీ జీఆర్పీ పోలీసుల విచారణలో సలీం రైలులో పలువురి మహిళల అర్దనగ్న వీడియోలను షూట్ చేశాడని తేలింది. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన సలీంపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వెంటనే రిమాండ్ కు తరలించారు.
కాగా, నిందితుడు షేక్ సలీంను కళ్యాణ్ నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రైల్వేలో సలీం ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. విధినిర్వహణలోనే గోరఖ్పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ ఎక్కిన సలీం.. ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు.