కోడలి బెడ్ రూంలో సీసీ కెమెరా: రూ 35 లక్షలు డిమాండ్
భువనేశ్వర్: అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అత్తమామలే దారుణానికి పాల్పడ్డారు. కోడలి బెడ్ రూం దృశ్యాలు చిత్రీకరించి రూ. 35 లక్షలు తీసుకురావాలని బ్లాక్ మెయిల్ చేశారు.
ఓడిశా రాష్ట్రంలోని ఖుర్జా నగరంలో డాక్టర్ నీరజా నళిని మొహంతి దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు వారాల క్రితం నిరజా నళిని దంపతులు తమ కుమారుడికి వైభవంగా వివాహం జరిపించారు. నగరంలోని పెద్దలు శుభకార్యానికి వెళ్లి నవదంపతులను అశీర్వధించారు.
కోడలి దగ్గర అదనపు కట్నం తెప్పించాలని నీరజా నళిని దంపతులు ప్లాన్ వేశారు. కోడలి పడక గదిలో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ బెడ్ రూం దృశ్యాలు చిత్రీకరించి కోడలికి చూపించారు.
వెంటనే రూ. 35 లక్షలు తీసుకురావాలని లేదంటే సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్స్ పోస్టు చేస్తామని కోడలిని బ్లాక్ మెయిల్ చేశారు. పెళ్లి జరిగిన మూడు వారాలకే అత్తమామల అరాచకాలు వెలుగు చూడటంతో ఆమె విసుగు చెందారు.
అదనపు కట్నం తీసుకురావాలని తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడలు ఖుర్జా నగర పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.