ఘోరం: తమ పార్టీకి ఓటేయలేదని కాల్చేశారు! మృతి
నాసిక్ జిల్లా యేవలా తాలుకా బభూల్ గావ్ గ్రామానికి చెందిన జోలూబాయి జగన్నాథ్ వాబలే (65) గురువారం రాత్రి ఇంటి ముంగిట అరుగు పైన కూర్చొని ఉండగా అదే గ్రామానికి చెందిన అశోక్ సోపన్, పాండురంగ సోపన్ బోరనారే, నందకిశోర్ విశ్వనాథ్ బురక్ కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలానా అభ్యర్థికి ఓటేయలేదన్న అక్కసుతో ఏయెలా నియోజకవర్గంలో కొంతమంది దుండగులు 65 ఏళ్ల వృద్ధురాలిని పాశవికంగా కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఆమె పేరు జెలుబాయ్ వాబ్లే. ఎలక్ర్టానిక్ ఓటింగ్ మెషిన్లో నెంబర్ 2కు ఎదురుగా అభ్యర్థికి ఆమె ఓటు వేయలేదన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు ఈనెల 16న ఆమె ఇంటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
దీంతో 80 శాతం కాలిన గాయాలతో ఆమె ఐదు రోజులపాటు ఆస్పత్రిలో నరకయాతన పడి సోమవారం మృతి చెందింది. ఎన్సీపీ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి ఛగన్ భుజ్బల్ పోటీ చేసిన నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. తనపై ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ఆమె మరణ వాంగ్మూలంలో చెప్పింది.
తనకు మీట అర్థం కాక ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కానని ఆ వృద్ధురాలు తనను నిలదీసిన వారికి కూడా చెప్పిందంట. అయితే వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ తన తల్లికి కాలిన గాయాలయ్యాయని ఆమె కొడుకు రఘునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.