రోడ్డుపై ఘోరం: టీచర్ని 22సార్లు పొడిచి చంపిన ప్రేమోన్మాది, ఎవరూ కాపాడలేదు (వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం నాడు దారుణం జరిగింది. తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది నడి వీధుల్లో అందరు చూస్తుండగా ఓ ఉపాధ్యాయురాలిని 22సార్లు పొడిచి చంపేశాడు. ఈ ఘటనను చూసిన కొందరు కూడా పట్టించుకోకుండా వెళ్లడం గమనార్హం.
నిందితుడి పేరు సురేందర్ (34). అతను గత ఏడాదిగా టీచర్ అయిన కరుణ (21) వెంట పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు దీనిని పట్టించుకోలేదని అంటున్నారు.
కరుణ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రేమించలేదన్న ఆగ్రహంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. ఐదు నెలల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు ఇరువురి మధ్య రాజీకుదిర్చారని చెబుతున్నారు. కాగా, సురేందర్కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, అక్కడ కేసు కొనసాగుతోందని చెబుతున్నారు.
నాడు రాజీ పడ్డారు: పోలీసులు
గతంలో ఫిర్యాదు అందిన విషయమై పోలీసులు స్పందిస్తూ.. అయిదు నెలల క్రితం సురేందర్ పైన కరుణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అతడే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులు మాట్లాడుతూ.. నాడు సురేందర్ పైన ఫిర్యాదు చేశారని, కానీ ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీపడ్డాయని చెప్పారు. సురేందర్ భార్యతో విడాకుల కేసు విచారణలో ఉందన్నారు. కరుణను దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.