ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటో సరదా... గన్తో ఫోజిస్తూ..
ఆగ్రా : ఫోటోలు తీసుకోవడమంటే కొందరికి సరదా. ఫోటోలకు వివిధ రకాల ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇలా చేస్తూ అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఫోటోకు ఫోజిస్తూ చేసిన పొరపాటుతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
మంటగలిసిన మానవత్వం : భర్త చనిపోయాడని బస్సు నుంచి దింపేశారు..
గన్ భద్రపరచమన్న మామ
ఆగ్రాలోని దుర్గానగర్ కాలనీకి చెందిన జాన్వీకి ఏడాది క్రితం విశ్వజిత్ తోమర్తో వివాహమైంది. విశ్వజిత్ తండ్రి సుభాష్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. సైనికుడు కావడంతో ఆయన వద్ద లైసెన్స్డ్ తుపాకీ ఉంది. అయితే రెండు రోజుల క్రితం సుభాష్ తోమర్.. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న కొడకు విశ్వజిత్ వద్దకు బయలుదేరాడు. ఆ సమయంలో తన తుపాకీని కోడలు జాన్వీకి ఇచ్చి భద్రపరచమని చెప్పాడు.
గన్ పట్టుకుని ఫోటో దిగాలని
మామ ఇచ్చిన తుపాకీని చూసిన జాన్వీ బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. ఆ గన్ను పట్టుకుని ఫోటో దిగాలని ఆశపడింది. వరసకు కోడలైన డాలీ అనే 13ఏళ్ల అమ్మాయిని పిలిచి ఫోటో తీయమని అడిగింది. డాలీ అందుకు సిద్ధం కాగా.. జాన్వీ తుపాకీతో ఫోటోకు ఫోజు ఇస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో గన్లోని బుల్లెట్ ఆమె శరీరంలోకి దూసుకుపోయింది.
చావు బతుకుల మధ్య హాస్పిటల్లో
బుల్లెట్ గాయంతో రక్తపు మడుగులో ఉన్న జాన్వీని చూసిన డాలి భయంతో కేకలు వేసింది. బుల్లెట్ సౌండ్, డాలీ ఏడుపు విన్న చుట్టుపక్కల వారు వచ్చి జాన్వీని హాస్పిటల్కు తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు బుల్లెట్ గుండెకు దగ్గరగా దూసుకెళ్లడంతో ఎడమ ఊపిరితిత్తుల్లో గాయమైందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న డాలీ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.