బంగారమే బంగారం: ఇంట్లోకాదు... ఆమె కడుపులో..! బాప్రే కిలోన్నర వెలికి తీశారు
బెంగాల్ : సాధారణంగా బంగారం స్మగ్లింగ్ చేయాలంటే రకరకాల దారులు వెతుకుతూ ఉంటారు. లోదుస్తుల్లోనో లేక నోట్లోనో శరీరంలోనే ఎవరికీ కనిపించకుండా ఉండే చోటున దాచేసి బంగారంను స్మగ్లింగ్ చేస్తు ఉంటారనే వార్తలు చదివి ఉంటాం. కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా కడుపులోనే బంగారం ఉంచి స్మగ్లింగ్ చేసిన దృశ్యాలను చూశాం. అయితే ఇక్కడ కూడా ఓ మహిళ బంగారంను కడుపులో దాచుకుంది. అయితే ఇది స్మగ్లింగ్ కోసం కాదు.
కడుపునొప్పితో బాధ పడిన మహిళ
పశ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఉంటే ఆమె తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులకు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువులను వెలికి తీయాలని చెప్పారు. ఇక ఆపరేషన్ చేసి తన బిడ్డను ఆ కడుపు నొప్పి నుంచి విముక్తి కలిగించాలని తల్లిదండ్రులు వైద్యులను ప్రాథేయపడ్డారు.
ఆపరేషన్ నిర్వహించిన వైద్యులకు షాక్
రామ్పుర్హాత్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహిళకు ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. ఆపరేషన్ చేసిన వైద్యులకు దిమ్మతిరిగి పోయింది. కడుపులో చాలామటుకు బంగారు వస్తువులు కనిపించాయి. ఇందులో బంగారపు గొలుసులు, ముక్కుపొడకలు, కమ్మలు, గాజులు, బ్రేస్లెట్లు, వాచీలతో పాటు రూ.5 మరియు రూ.10 నాణేలు కనిపించేసరికి షాక్కు గురయ్యారు. మొత్తానికి ఆపరేషన్ను విజయవంతంగా ముగించిన డాక్టర్లు ఆ తర్వాత సర్జరీకి సంబంధించిన విషయాలు బయటపెట్టారు. కడుపునొప్పితో బాధపడిన మహిళ కడుపు నుంచి బంగారు నగలతో పాటు 90 కాయిన్లను కూడా వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. ఇక నగలు మొత్తం బంగారం, రాగి, వెండితో చేసినవని చెప్పారు. ఇదిలా ఉంటే తన ఇంట్లో నుంచి నగలు మాయమవడం పై గత కొద్దిరోజులుగా చాలా ఆందోళనకు గురైనట్లు మహిళ తల్లి చెప్పింది. అంతేకాదు దీనిపై దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు ఆ మహిళ తల్లి చెప్పింది.
మతిస్థిమితం లేకే బంగారు వస్తువులను మింగేసిందన్న తల్లి
ఇక తనకూతురు మానసిక పరిస్థితి బాగోలేదని అందుకే తనకు తెలియకుండానే వీటిని మింగేసి ఉంటుందని తల్లి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆమె ఆహారం తీసుకున్న ప్రతిసారి తిరిగి వామిటింగ్ చేసేదని వెల్లడించింది. ఇక కాయిన్లను తన సోదరుడి దుకాణం నుంచి తీసుకొచ్చుకున్నట్లు తెలిపింది. ఆమెపై నిఘా వేసి ఉంచినట్లు చెప్పిన తల్లి, వారి కళ్లుగప్పి వీటిని మింగేసిందని చెప్పుకొచ్చింది. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని వివరించిన తల్లి... పలు హాస్పిటల్లో చూపించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని చెప్పింది. చివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి మింగిన వస్తువులను వెలికి తీశారని వెల్లడించింది.