ఉపాధ్యాయురాలిపై అధికార పార్టీ నేతల దాష్టీకం: తాడుతో కట్టి..రోడ్డుపై ఈడ్చుకుంటూ..!
కోల్కత: పశ్చిమ బెంగాల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. ఉపాధ్యాయురాలిని తాడుతో కట్టి, రోడ్డుపై ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. భూ వివాదానికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య తలెత్తిన మనస్పర్థలు, ఘర్షణలు ఈ ఉదంతానికి దారి తీశాయని పోలీసులు వెల్లడించారు. దక్షిణ దినాజ్పూర్ జిల్లా గంగారాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫటానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధిత ఉపాధ్యాయురాలి పేరు స్మృతికోన దాస్. ఫటానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన చెల్లెలు సోమాదాస్తో కలిసి ఆమె నివసిస్తున్నారు. ఫటా నగర్లో రోడ్డు వెడల్పు సందర్భంగా స్మృతి దాస్ నివాసాన్ని సుమారు 10 అడుగుల మేర కూలగొట్టాల్సి వచ్చింది. దీనికి నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఫటానగర్ పంచాయితీ అధికారులు ముందుకు రావడంతో ఆమె అంగీకరించారు. అనంతరం 20 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉందని, దీనికి అంగీకరించాలని కోరుతూ స్మృతిదాస్కు నోటీసులను జారీ చేశారు.
WB: A primary school teacher in Gangrampur of South Dinajpur dist was tied with a rope, dragged&beaten up by a group of people, allegedly including a local TMC leader Amal Sarkar,after she protested against their bid to acquire her land forcibly for construction of a road.(02.02) pic.twitter.com/zFOYoYlxMW
— ANI (@ANI) February 2, 2020
దీనికి ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ..పంచాయితీ అధికారులు ఆమె నివాసాన్ని పడగొట్టడానికి ప్రయత్నించగా..అడ్డుకున్నారు. దీనితో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అమల్ సర్కార్ అనే నాయకుడు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జేసీబీకి అడ్డుగా కూర్చున్న ఆమె మెడకు తాడును కట్టి.. అక్కడి నుంచి లాక్కెళ్లాడు. ఇనుప రాడ్లతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్మృతి దాస్ చెల్లెలు సోమాదాస్ పైనా దాడి చేశారు.
అనంతరం స్మృతి దాస్ గంగారాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అమల్ సర్కార్ గతంలో గంగారాంపూర్ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. అమల్ సర్కార్ను అప్పటికప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బాధితురాలికి పూర్తిస్థాయిలో నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.