లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినందుకే నా పై బదిలీ వేటు: టీసీఎస్ మహిళా టెక్కీ
చెన్నై: లైంగికంగా వేధించడంతో ఫిర్యాదు చేసినందుకు తనపై సంస్థ బదిలీవేటు వేసిందని పేర్కొంటూ టీసీఎస్ మహిళా టెక్కీ లేబర్ కోర్టును ఆశ్రయించింది. తనను ఎలాంటి వివరణ కోరకుండా మరో కంపెనీలోనే మరో శాఖకు బదిలీ చేసిందని ఫిర్యాదులో మహిళా టెక్కీ పేర్కొంది. కోర్టులో కేసు వేయడంతో మహిళా టెక్కీని తిరిగి తన పాత ప్రాజెక్టుకు బదిలీ చేసింది టీసీఎస్ సంస్థ. అంతేకాదు తన సర్వీస్ నిబంధనలను మార్చకుండా కేసు అయ్యేవరకు తనను పాత ప్రాజెక్టులోనే ఉంచాలని ఆదేశాలు ఇవ్వాలంటూ తన పిటిషన్లో కోర్టును కోరింది.
గతేడాది ఆగష్టులో జీతాల పెంపు సమయంలో ఆమెతో తన మేనేజర్ మాట్లాడారని మహిళ పేర్కొంది. మేనేజర్ ఒంటరిగా ఉంటూ తన గదిలోకి జీతాల పెంపు విషయమై మాట్లాడాలని పిలిచి లైంగికంగా వేధించాడని మహిళ తెలిపింది. ఇదంతా ఆన్సైట్లో యూకేలో ఉన్నప్పుడు జరిగిందని ఫిర్యాదులో మహిల పేర్కొంది. ఇక ఇదే విషయమై భారత్కు రాగానే కంపెనీ దృష్టికి తీసుకురాగా వారు అంతర్గత విచారణ కమిటీకి ఫార్వర్డ్ చేసినట్లు చెప్పింది. అయితే విచారణ చేసిన అధికారులు ఎలాంటి లైంగిక వేధింపులకు మేనేజర్ పాల్పడలేదని నిర్థారణకు వచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. టీసీఎస్ అంతర్గత విచారణను పక్కనపెట్టి తిరిగి కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇక కోర్టులో పిటిషన్ వేసి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆమెపై వేధింపులు మరింత ఎక్కువైనట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఉద్యోగపరంగా బాధితురాలు పెర్ఫార్మెన్స్ బాగా ఉందని ఆమె పై అధికారులు చెబుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆమెనే లక్ష్యంగా చేసుకుని పనిపరంగా వేధింపులు ఎక్కువైయ్యాయని సహోద్యోగులు చెబుతున్నారు. తన టీమ్లోని సభ్యులంతా పాత ప్రాజెక్టుపై పనిచేస్తుండగా తనను మాత్రం మరో ప్రాజెక్టుకు తరలించడం అన్యాయమని బాధితురాలు చెప్పారు.
మీ టూ మూవ్మెంట్ పేరుతో ప్రపంచదేశాలతో పాటు భారత్లోని మహిళలు కూడా తమ వర్క్ ప్లేస్లలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెప్పుకున్నారు. కానీ ఈ టెక్కీ మహిళ కేసుకు ఒక ప్రత్యేకత ఉంది. తాను ఆఫీసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కేసును కోర్టు విచారణకు స్వీకరించడం దేశంలోనే తొలికేసుగా నిలిచింది. ఇది కాంచీపురంలో కోర్టులో నమోదైంది.