మహిళల ఉగ్రరూపం: అధికారిపై చెప్పులతో దాడి
గ్వాలియర్: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని చెప్పులతో కొట్టింది ఓ మహిళ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్లను మంజూరు చేయడంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తూ అందరి ముందూ ఆయనపై చెప్పులతో దాడి చేసింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధికారులను చెప్పులతో కొట్టడం, వారిపై చెప్పులను విసిరేయడం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
గ్వాలియర్ లో కొద్దిరోజులుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన వారికి ఇళ్లను కేటాయించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దరఖాస్తులను అందజేశారు. దరఖాస్తుల వడపోత పనులు నడుస్తున్నాయి. ఇక్కడే కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, తమకు పెద్ద ఎత్తున లంచం ఇచ్చిన వారి పేర్లను మాత్రమే తుది జాబితాలో నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో- కొందరు మహిళలు సంబంధిత అధికారిని ప్రశ్నించడానికి ఏకంగా ఆయన కార్యాలయానికే వెళ్లారు.
ఈ సందర్భంగా వారి పట్ల సంబంధిత అధికారులు దురుసుగా ప్రవర్తించారట. పైగా లంచం ఇస్తేనే పనులు తొందరగా పూర్తవుతాయంటూ హేళనగా మాట్లాడారట. దీనితో ఆగ్రహించారు మహిళలు. ఉగ్రరూపాన్ని ధరించారు. ఆ అధికారి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. వారిని అడ్డుకోవడానికి అటెండర్లు ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, అటెండర్లు మహిళలను దూషించినట్లు చెబుతున్నారు.
#WATCH Madhya Pradesh: A woman thrashes a govt official with a slipper as a group of women engages in a verbal spat with him over alleged wrongful allocations of houses under Pradhan Mantri Awas Yojana, in Gwalior. The women alleged that houses have been wrongly allocated.(03.10) pic.twitter.com/5AEKR9eHUz
— ANI (@ANI) October 3, 2019
దీనితో ఆగ్రహించిన మహిళలు ఏకంగా దాడికి దిగారు. ఆ మహిళల్లో ఒకరు తన చెప్పులను తీసుకుని ఎడాపెడా వాయించేశారు. వాటిని అధికారులపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అదే కార్యాలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు వచ్చిన తరువాత గానీ వారు శాంతించలేదు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను వారించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ అధికారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.