ప్రియుడిపై యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్.. చేసింది ప్రియురాలే.. ఎందుకంటే?
ఢిల్లీ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మూడేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రియురాలు పెళ్లి చేసుకుందామనేసరికి ప్రియుడు మాట మార్చాడు. ఆమెకు బ్రేకప్ చెప్పాడు. అది భరించలేని యువతి ప్రియుడిపై పగ పెంచుకుంది. పక్కా ప్లాన్తో యసిడ్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడటంతో ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరింది.
ఆ బోటుకు ఏమైంది? 243మంది ఎక్కడున్నారు? 5 నెలలుగా వీడని మిస్టరీ..
యువకుడిపై యాసిడ్ దాడి
2019 జూన్ 11. ఢిల్లీ వికాస్పురిలో ఏరియా. ఓ బైక్పై యువతీ యువకుడు దూసుకుపోతున్నారు. ఇంతలో బైక్ నడుపుతున్న యువకుడితో పాటు యువతి హాహాకారాలు చేస్తూ బైక్పై నుంచి పడిపోయారు. అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు గుర్తించారు. యాసిడ్ దాడిలో యువకుడి ముఖం, మెడ, ఛాతీ భాగంలో యువతికి చేతులపై కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తీగలాగితే కదిలిన డొంక
రోజులు గడుస్తున్నా యాసిడ్ దాడి ఎవరు చేశారన్న విషయంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా గాయపడిన వ్యక్తిని విచారించడంతో చిన్న క్లూ దొరికింది. బైక్పై వెళ్తున్న సమయంలో వెనక సీట్లో కూర్చున్న అతని ప్రియురాలు హెల్మెట్ తీయమని కోరడంతో తాను తీశానని యువకుడు చెప్పాడు. ఈ మాట ఆధారంగా పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. సదరు యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
ప్రియురాలి అరెస్ట్
యాసిడ్ దాడిలో గాయపడిన ఇద్దరు యువతీయువకులు ప్రేమికులని పోలీసు విచారణలో తేలింది. మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ప్రియురాలుప పెళ్లి చేసుకుందామనే సరికి అబ్బాయి లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.దీంతో అతనిపై కోపం పెంచుకున్న యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. జూన్ 11న దాన్ని అమలు చేసింది. ప్రియుడితో పాటు బైక్పై వెళ్తూ హ్యాండ్ బ్యాగ్లో దాచుకున్న యాసిడ్ బాటిల్ తీసి అతనిపై పోసింది. దీంతో ప్రియుడికి తీవ్ర గాయాలుకాగా.. ఆమె స్వల్పంగా గాయపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.