యువతిపై పిడిగుద్దులు.. ఇదెక్కడి అరాచకంరా నాయనా..! (వీడియో)
గుర్గావ్ : టోల్ గేట్ల దగ్గర కొందరు రెచ్చిపోతున్నారు. టోల్ ఛార్జీలు అడిగిన పాపానికి సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల మహిళా సిబ్బంది అని కూడా చూడకుండా పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా హర్యానాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే టోల్ ప్లాజాల దగ్గర సరైన సెక్యూరిటీ లేకపోవడంతోనే ఇలా దాడులు జరుగుతున్నాయనే వాదనలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో నిందితులు పోలీసులకు పట్టుబడుతున్నా.. మరికొన్ని కేసుల్లో తప్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
టోల్ ఛార్జీలు అడిగితే పిడిగుద్దులు
హర్యానాలోని కేర్కి దౌలా టోల్ గేట్ దగ్గర కారు డ్రైవర్ దాదాగిరి చేశాడు. టోల్ప్లాజా ఛార్జీలు అడిగిన సిబ్బందిపై దాడి చేశాడు. కౌంటర్లో ఉన్నది మహిళ అని కూడా చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ కారు డ్రైవర్ మాత్రం అలా కొడుతూనే ఉన్నాడు. చివరకు క్యాబిన్ నుంచి బయటకు వెళ్లి సదరు కారు డ్రైవర్ను చెడామడా తిట్టేసింది. అయితే లేడీ అనే ఇంగీత జ్ఞానం లేకుండా ఆ డ్రైవర్ ప్రవర్తించిన తీరుపై దుమారం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చివరకు అక్కడి సిబ్బంది డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
జూన్ నెలలో కూడా ఇలాగే.. అదే టోల్ ప్లాజాలో మరో యువతిపై దాడి
జూనె నెల మూడో వారంలో హర్యానాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అదే టోల్ ప్లాజా ఉద్యోగిపై ఓ కారు డ్రైవర్ పిడిగుద్దులు కురిపించాడు. విధి నిర్వహణలో భాగంగా టోల్ ఫీ అడిగినందుకు ఆమెపై చేయి చేసుకున్నాడు. కేర్కి దౌలా టోల్ ప్లాజా మీదుగా వెళుతున్న ఓ కారు డ్రైవర్.. టోల్ ఫీ అడిగినందుకు రెచ్చిపోయాడు. అక్కడున్నది మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా చేతులకు పని చెప్పాడు.
ఆమె డబ్బుల కోసం చేయి చాపగా.. తాను టోల్ ఫీ చెల్లించే ప్రసక్తే లేదంటూ వాదానకు దిగాడు. అంతేకాదు ఆమె చేతులను మెలికలు తిప్పి నానా రభస చేశాడు. అంతటితో ఆగకుండా మరింత దురుసుగా ప్రవర్తించాడు. వాడి దెబ్బలు తాళలేక ఆమె కన్నీరు మున్నీరైంది. అక్కడి సిబ్బంది పోగయి వాడ్ని పట్టుకునే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!
టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో ఈడ్చుకెళ్లి హింసించారు..!
ఏప్రిల్ రెండో వారంలో కూడా ఇలాంటి ఘటన గురుగ్రామ్లో చోటు చేసుకుంది. టోల్ టాక్స్ కట్టమన్న పాపానికి ఉద్యోగికి నరకం చూపించారు కొందరు. బాధితున్ని తన వాహనంతో ఢీకొట్టి, కారు బానెట్పై పడిన ఉద్యోగిని దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. గురుగ్రామ్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో వైరల్గా మారింది.
గురుగ్రామ్లోని టోల్ ప్లాజా వద్దకు ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు గేటు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ విషయం గ్రహించి అక్కడ పనిచేసే ఉద్యోగి అశోక్ ఎదురుగా వచ్చి కారు ఆపమని కోరాడు. దీంతో తన వాహనాన్ని పోలీసులు కూడా అడ్డుకోరని, అలాంటిది నువ్వెలా ఆపుతావంటూ డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఆగ్రహించాడు. కారుతో అశోక్ను ఢీ కొట్టాడు. దీంతో బాధితుడు కారు బానెట్పై పడిపోయాడు. అయినా కారును ఆపని ఆ దుర్మార్గుడు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోనిచ్చాడు. బానెట్పై పడిన ఉద్యోగి భయంతో కారు వైపర్లను పట్టుకుని ఉండిపోయాడు. దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు అలాగే వెళ్లి మానేసర్ ప్రాంతంలో ఆపి అతడిపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కారు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.