రైల్లో పురిటి నొప్పులు: రైల్వేస్టేషన్ లో ప్రసవం: సమయానికి ఆదుకున్న ఒక్కరూపాయి క్లినిక్
ముంబై: తొలి చూలు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తోన్న ఓ మహిళ రైల్వే స్టేషన్ లో పురుడు పోసుకున్న ఉదంతం ఇది. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై నుంచి తన స్వగ్రామానికి బయలుదేరారు ఓ నిండు చూలాలు. 20 ఏళ్ల వయస్సున్న ఆ మహిళకు అదే తొలి ప్రసవం. పుట్టింటికి వెళ్లడానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి కొంకణ్ కన్య ఎక్స్ ప్రెస్ లో బయలు దేరారు. కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. రైలు థానే చేరుకునే సరికి తీవ్రతరమయ్యాయి. ఆమె పరిస్థితిని గుర్తించిన తోటి ప్రయాణికులు టీటీఈకి సమాచారం ఇచ్చారు.
దీనితో అతను రైలును థానే స్టేషన్ లో ఆపేశారు. స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇఛ్చారు. వెంటనే- థానే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి క్లినిక్ కు తరలించారు. అక్కడ ఆమె పండంటి బిడ్డను ప్రసవించారు. సాధారణ కాన్పు ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి క్లినిక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రూపాయి క్లినిక్ మరోసారి విలువైన ప్రాణాలను కాపాడిందని వ్యాఖ్యానించారు.
ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వశాఖ రైల్వేస్టేషన్లలో ఒక్క రూపాయి క్లినిక్ లను నెలకొల్పిన విషయం తెలిసిందే. నామమాత్రపు ఫీజులతో ఈ క్లినిక్ లల్లో వైద్యసేవలను అందజేస్తారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేశారు. ఆ క్లినిక్ లు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నాయి. కొద్దిరోజుల కిందట కూడా- ఓ నిండు గర్భిణి ఒక్క రూపాయి క్లినిక్ లో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. ఆమె కవలలకు జన్మనిచ్చారు.