అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పి ఇంట్లోకి రా: శబరిమలలోకి వెళ్లిన కనకదుర్గకు అత్తింటివారు
తిరువనంతపురం: కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువతుల్లో కనకదుర్గ ఒకరు. ఆమెను అత్తింటి వారు ఇంట్లోకి రానీయడం లేదు. చేసిన పాపానికి శక్ష అనుభవించాలని ఇంటి నుంచి గెంటేశారు.
అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ.. అత్త ఆమెపై గతంలో చేయి చేసుకున్నారు. తాజాగా, కనకదుర్గను ఇంట్లోకి రానీయడం లేదు. దీంతో ప్రస్తుతం ఆమె కేరళలోని పథనమ్తిట్ట జిల్లాలోని ఓ ప్రభుత్వ గృహంలో ఉంటోంది. ఈ విషయాన్ని కనకదుర్గతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన బిందు వెల్లడించారు.
కనకదుర్గ తమతో అబద్ధం చెప్పి ఆలయంలోకి వెళ్లిందని ఆమె అత్తింటివారు అంటున్నారని, ముందుగా ప్లాన్ చేసుకుని తిరువనంతపురంలో జరుగుతున్న సమావేశానికి హాజరువుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిందని చెబుతున్నారని, అందుకే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని బిందు అన్నారు.
ఇటీవల కనకదుర్గకు, బిందుకు 24 గంటలూ భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కనకదుర్గ అత్తింటి వారికి నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించలేదు. కనకదుర్గ అయ్యప్ప భక్తులకు బహిరంగంగా క్షమాపణలు చెబితే ఇంట్లోకి రానిస్తామని ఆ కుటుంబం తెలిపింది.