భర్తతో కలిసి ఉండే హక్కు ఉంది: శబరిమలలోకి వెళ్లిన కనకదుర్గపై విలేజ్ కోర్టు తీర్పు
తిరువనంతపురం: కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, అందుకే అందరికీ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇంట్లోకి అడుగు పెట్టాలని శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన కనకదుర్గకు అత్తింటి వారు చెప్పిన విషయం తెలిసిందే. ఆమెను ఇంట్లోకి రానీయలేదు. దీనిపై ఆమె మల్లపురం విలేజ్ కోర్టుకు (గ్రామ న్యాయాలయ) వెళ్లారు.
ఇక్కడ ఆమెకు ఊరట లభించింది. ఈ మేరకు గ్రామ న్యాయాలయ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కనకదుర్గకు తన భర్తతో కలిసి ఉండే హక్కు ఉందని పేర్కొంది. కనకదుర్గకు భర్తతో కలిసి ఇంట్లో ఉండే హక్కు ఉందని, ఈ మేరకు గ్రామ న్యాయాలయ అధికారి కేకే నిమ్మి పేర్కొన్నారు. ఆమెకు ఆ ఇంట్లో సమాన హక్కులు ఉంటాయన్నారు.
న్యాయాలయ తీర్పుపై కనకదుర్గ ఆనందం
గ్రామ న్యాయాలయ అధికారి తీర్పు పైన కనకదుర్గ స్పందించారు. తన ఇంట్లోకి తనకు వెళ్లేందుకు పూర్తి హక్కు ఉందని, కోర్టు తీర్పు చెప్పడం చాలా సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. నేను ఎలాంటి పాపం చేయలేదని, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు నచ్చ చెబుతానని అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. తాను అత్తింట్లో ఉండటంపై తేల్చాల్సింది తన భర్త అని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రభుత్వ షెల్టర్లో ఉంటున్నానని, కోర్టు ఆర్డర్ కోసం ఇప్పటి వరకు వేచి చూశానని చెప్పారు.
క్షమాపణ చెప్తే రానిస్తామని అత్తింటివారు
కాగా, కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువతుల్లో కనకదుర్గ ఒకరు. ఆమెను అత్తింటి వారు ఇంట్లోకి రానీయలేదు. చేసిన పాపానికి శక్ష అనుభవించాలని ఇంటి నుంచి కొద్ది రోజుల క్రితం గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ.. అత్త ఆమెపై తొలుత చేయి చేసుకున్నారు. ఆ తర్వాత కనకదుర్గను ఇంట్లోకి రానీయలేదు. దీంతో ఆమె కేరళలోని పథనమ్తిట్ట జిల్లాలోని ఓ ప్రభుత్వ గృహంలో ఉంది. ఈ విషయాన్ని కనకదుర్గతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన బిందు వెల్లడించారు.
అబద్దం చెప్పి వెళ్లిందని
కనకదుర్గ తమతో అబద్ధం చెప్పి ఆలయంలోకి వెళ్లిందని ఆమె అత్తింటివారు అంటున్నారని, ముందుగా ప్లాన్ చేసుకుని తిరువనంతపురంలో జరుగుతున్న సమావేశానికి హాజరువుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిందని చెబుతున్నారని, అందుకే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని బిందు అన్నారు. కనకదుర్గకు, బిందుకు 24 గంటలూ భద్రత కల్పించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కనకదుర్గ అత్తింటి వారికి నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించలేదు. కనకదుర్గ అయ్యప్ప భక్తులకు బహిరంగంగా క్షమాపణలు చెబితే ఇంట్లోకి రానిస్తామని ఆ కుటుంబం తెలిపింది. దీంతో కనకదుర్గ గ్రామ న్యాయాలయకు వెళ్లింది.