ఆసారాం బాపుపై రేప్ కేసు పెట్టిన మహిళ, ఫ్యామిలి అదృశ్యం
అహ్మదాబాద్: ఆసారాం బాపూ పైన లైంగిక వేధింపుల కేసు పెట్టిన 33 ఏళ్ల మహిళ అదృశ్యమైంది. వారం రోజులుగా ఆమె, ఆమె భర్త, తనయుడు కనిపించడం లేదని పోలీసులు గురువారం నాడు చెప్పారు. ఆసారాం పైన సదరు మహిళ సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టిందని, ఆమె ఇప్పుడు కనిపించడం లేదని చెబుతున్నారు.
ఆసారాం బాపు పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వారి కుటుంబ రక్షణ కోసం నలుగురు కానిస్టేబుల్స్ను పెట్టామని చెప్పారు. తాము నగరంలోని అమ్రోలి ప్రాంతంలో ఓ పెళ్లికి వెళ్తున్నామని, తమకు అక్కడ పోలీసు భద్రత అవసరం లేదని డిసెంబర్ 14వ తేదీన మహిళ, ఆమె భర్త, కొడుకులు తమ కానిస్టేబుల్స్కు చెప్పారని తెలిపారు.
అప్పటి నుండి ఆ మహిళ కానీ, ఆమె భర్త లేదా కొడుకు తిరిగి రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు స్టేషన్లో డిసెంబర్ 18వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తాము పెళ్లికి వెళ్తున్నామని వారు చెప్పిన నేపథ్యంలో ఆ దిశలో పోలీసులు విచారించారు. అయితే, అక్కడ ఆ రోజున ఎలాంటి పెళ్లి లేదని పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాకుండా, అప్పటి నుండి వారి సెల్ పోన్లు కూడా స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.