ఆ మాజీ చీఫ్ జస్టిస్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన మహిళ తిరిగి విధుల్లోకి..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై గతంలో ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమెను సుప్రీంకోర్టు విధుల నుంచి తప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ మహిళ విధుల్లో చేరి తిరిగి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెకు రావాల్సిన బకాయిలు సైతం క్లియర్ అయినట్లు సమాచారం.
2014 మే నెలలో సుప్రీంకోర్టులో ఆ మహిళ విధుల్లో చేరింది. అక్టోబర్ 2018లో సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్గా ఉన్న రంజన్ గొగోయ్ నివాసంలోని కార్యాలయంలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెను బదిలీ చేసి ఆ తర్వాత సర్వీసు నుంచి తప్పించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ విచారణ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు ఉన్నారు. విచారణ చేపట్టిన వీరు మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయకూడదన్న రూలింగ్ ఉండటంతో అది బయట పెట్టలేదు.
ఇదిలా ఉంటే విచారణ సమయంలో తనకు న్యాయపరమైన సహకారం లభించకపోవడంతో విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కమిటీని కోరుతూ నిరాశను వ్యక్తం చేసింది. ఏప్రిల్ 2019లో వెలుగులోకి రాగానే మహిళ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ చెప్పారు. ఇక మహిళను సర్వీసు నుంచి తొలగించిన తర్వాత ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న తన భర్త, తన మరిదిని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పింది. మరోవైపు అంటే జూన్ 2019లో ఆమె భర్తను, మరిదిని తిరిగి విధుల్లో తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓ వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ మహిళ డబ్బులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు రావడంతో ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయి.