కోడలి పైశాచికం: అత్తకు టీలో మూత్రం పోసి ఏడాదిగా..
ఇండోర్: ఓ కోడలు తన అత్తపై పైశాచికత్వాన్ని చాటుకుంది. తన అత్తకు ఇచ్చే టీలో మూత్రం పోసి ఇస్తోంది. ఇలా ఏడాది కాలంపాటు చేసింది. కాగా, ఇటీవల టీలో మూత్రం విసర్జన చేస్తూ అత్తకు దొరికిపోయింది. దీంతో ఆ కోడలు ఏడాది కాలంగా చేస్తున్న పైశాచిక చర్య బట్టబలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ జిల్లాలో నివాసముంటున్న దీపక్(34), రేఖ నగ్వన్షి ఇద్దరు భార్యాభర్తలు. వీరిది పెద్దలు కుదర్చిన వివాహం. అయితే దీపక్తో పెళ్ళి ఇష్టం లేని రేఖ అత్తింటిని వదిలి, అమ్మ గారింటికి చేరింది. కొంత కాలం గడిచిన తర్వాత రేఖను బతిమిలాడి దీపక్ తన ఇంటికి తీసుకెళ్ళాడు. దీనికి రేఖ కొన్ని షరతులు విధించింది.
వంట చేయడం, అంట్లు తోమడం, రేఖ కాళ్ళను మసాజు చేయడం లాంటివి దీపక్ చేయాలి. ఇది తెలుసుకున్న దీపక్ తల్లిదండ్రులు సూరజ్, అజిత్లు కోడలుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు. రేఖ చాలా మంకు మనస్తత్వం కలదని, స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటుందని ఆమె స్నేహితురాలు అలియా కోహ్లీ చెప్పింది.
ఎప్పుడైతే అత్తమామలు ఆమె ఆలోచనకు అడ్డు తగిలారో అప్పటి నుంచి వారిపై అక్కసుతో ఈ నిర్వాకానికి పూనుకొని ఉంటుందని ఆమె పేర్కొంది.
కాగా, తన కొడుకును చూడాలనిపించినప్పుడల్లా కొడుకు ఇంటికి వారానికి ఒకటి రెండు సార్లు వెళ్తామని అత్త సూరజ్(60) తెలిపింది. తామంటే ఇష్టముండదని తెలిసినప్పటకీ ఇంతటి ఘోరాన్ని తలపెడ్తుందని ఊహించలేదని ఆమె అన్నారు. అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇది తమ పరిధిలోకి రాదని వారు సెలవిచ్చారు. దీంతో వారు ఓ ప్రైవేట్ ప్రాసిక్యూటర్ను సంప్రదించారు. ప్రస్తుతం రేఖ, దీపక్లు విడివిడిగా ఉండటానికి నిర్ణయించుకున్నారు.